
దేశ హితమే ప్రధానం – ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్
- February 19, 2023
- 0 Comment(s)
గత శతాబ్ద కాలంగా భారతదేశ నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ పాత్ర చాలా కీలకమైనదని అయితే ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ పై అనేక అపోహలు నెలకొన్నాయని ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలతో మమేకమయితే అపోహలు తొలిగిపోతాయని అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో ఆయన రాసిన “ఆర్ఎస్ఎస్ ప్రణాళిక 21వ శతాబ్దం కోసం” పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సునీల్ అంబేకర్ మాట్లాడుతూ ఆర్ ఎస్ ఎస్ ఎన్నడూ పేరు ప్రఖ్యాతులు కోరుకోలేదని గత శతాబ్ద కాలంలో స్వయంసేవకులు వివిధ రంగాల్లో పనిచేస్తున్న కారణంగా అనేక రుగ్మతలకు, సమస్యలకు పరిష్కారాలు లభించాయన్నారు. అంతేకాకుండా సామాన్య ప్రజలతో ఆర్ఎస్ఎస్ చేసిన సుదీర్ఘ ప్రయాణంతో దేశంలో అనేకమైనటువంటి అపరిష్కృత దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాలు లభించాయన్నారు. దేశ సంపూర్ణ వికాసం కోసం ఆర్ఎస్ఎస్ 21వ శతాబ్దంలో స్వయం సేవకుల నేతృత్వంలో విశేషంగా కృషిచేయనున్నట్లు సునీల్ అంబేకర్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తాను ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న కాలంలో ఆర్ఎస్ఎస్ పై వ్యతిరేకమైన ధోరణులు,వార్తలు ప్రాచుర్యంలో ఉండేవని తాను ఆర్ఎస్ఎస్ ను దగ్గరగా చూసిన తర్వాత అపోహలు దూరమయ్యాయన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమెస్కో ప్రచురణల సంస్థ అధినేత విజయ్ కుమార్ మాట్లాడుతూ దివిసీమ ఉప్పెన సంభవించిన సమయంలో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన సేవా కార్యక్రమాలను చూసి ఈ ప్రాంతంలో చాలామంది ఆర్ఎస్ఎస్ పట్ల ఆకర్షితులయ్యారని సేవా కార్యక్రమాల తీరును ప్రముఖంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మరో అతిథిగా పాల్గొన్న ఎమెస్కో సీనియర్ ఉప సంపాదకులు వల్లీశ్వర్ మాట్లాడుతూ ‘ఆర్ఎస్ఎస్ ప్రణాళిక 21వ శతాబ్దం కోసం’ పుస్తకంలో భారతదేశ విస్తృత ప్రయోజనాలు దాగున్నాయన్నారు. పుస్తక తెలుగు అనువాదకులు బీరం వెంకటేశ్వర రెడ్డి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత ప్రచార ప్రముఖ్ భయ్యా వాసు, నవయుగ భారతి ప్రచురణల సమన్వయకర్త వడ్డీ విజయ సారధి, ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్ నడింపల్లి ఆయూష్, ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి చిరిగె శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.