Description
నాగపూర్ లో ప్రారంభింపబడిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క నారును తెచ్చి ఆంధ్రప్రాంతంలో (ఈనాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లుగా వ్యవహరింపబడుతున్న తెలుగునాట) మొలకలు వేయించిన వ్యక్తిగా కాకపోయినా, నీరుపోసి ఆ మొలకలను పెంచి పెద్దజేసిన మొదటి వరుస వ్యక్తులలో పేర్కొనబడవలసిన వ్యక్తి శ్రీ సోమేపల్లి సోమయ్య గారు. ఒకప్పుడు చాలాకాలంగా ఆంగ్లేయులకు, నిజాం నవాబులకు ఆటపట్టుగా ఉండిన ఈ ప్రాంతాల్లో, తర్వాత కాలంలో నాస్తికవాదానికి, ఒకమేరకు ద్రవిడ వేర్పాటువాదానికి, అంతకుమించి కమ్యూనిస్టుల అంతర్జాతీయ వాదాలకు కూడా ఆటపట్టుగా ఉండిన ప్రాంతాలలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఎండిపోకుండా, శుష్కించిపోకుండా కాపాడుకొంటూ రావటంలో శ్రీ సోమయ్యగారి పాత్ర అసామాన్యమైనది. ఎన్నో ఆటుపోటుల మధ్య సాంఘిక జీవితం ఆందోళితమౌతున్న సందర్భాలలో, ప్రకృతి బీభత్సాలకు జనజీవితం అస్తవ్యస్తమౌతున్న సందర్భాలలో సత్వర సహాయం. శాశ్వత ప్రయోజనం కలిగే ప్రణాళికలు అమలు పరచబడటంలో వారి చొరవ, అనుభవంతో కూడిన మార్గదర్శనమూ అనుపమానమైనవి.
అట్టి వ్యక్తి 1995 జులైలో రైలు ప్రమాదంలో మరణించిన తర్వాత ఒక సంవత్సరం లోనే ‘వికసిత సంఘ కుసుమం శ్రీ సోమేపల్లి సోమయ్య’ పేరుతో ఒక పుస్తకం వెలువరించ బడింది. శ్రీ సోమయ్య గారితో సన్నిహిత సంబంధమున్న శ్రీ పులుసు గోపిరెడ్డి దానిని రచించారు. అయితే స్వల్పవ్యవధిలోనే వెలువరించవలసిరావటంతో, సమగ్రమైన విస్తృతమైన మరో పుస్తకం రావటం అవసరమన్న భావన చాలామందిలో ఉండటం గమనించాం. ఆ దిశలో జరిగిన ప్రయత్నంలో నుండి రూపుదిద్దుకొన్నదే ‘స్ఫూర్తిప్రదాత శ్రీ సోమయ్య’ పేరుతో వెలువడుతున్న ఈ పుస్తకం.
శ్రీ గోపిరెడ్డిగారు సేకరించి సంకలనం చేసిన విషయాలన్నీ అలా ఉంచుతూనే క్రొత్తగా అనేకమంది వ్రాసి పంపించిన అనుభవాలను, జ్ఞాపకాలను శ్రీ కె. శ్యాంప్రసాద్ జోడించారు.
Reviews
There are no reviews yet.