Description
పుస్తక పరిచయం :
హిందూ పద పాదుషాహీగా జాతి జనులు ఆరాధించిన ఛత్రపతి శివాజీ మహా విప్లవ వీరుడిగా ప్రసిద్ధి చెందాడు. విదేశీయులు, విధర్మీయుల ఎడ తెగని దాడులకు, దండయాత్రలకు, దురాక్రమణలకు గురైన హిందూ జాతిలో నిరాశ నిస్పృహలు పెరిగిపోయిన తరుణంలో తన ప్రతాపంతో, రాజనీతిజ్ఞతతో, ప్రణాళికా నైపుణ్యం తో హిందూ సామ్రాజ్యాన్ని ప్రతిష్ఠించి దేశీయులలో ఆశావహ ధృక్పధాన్ని పెంపొందిచిన మహా నాయకాగ్రగణ్యుడు శివాజీ. పరాక్రమ శక్తికీ పోరాట పటిమకీ మారుపేరైన గిరి, కానన వాసులలో దేశభక్తిని జాగృతం చేసి వారి చేత అనంత త్యాగాలు చేయించిన స్ఫూర్తి ప్రదాత శివాజీ.
ప్రతికూల పరిస్థితిల్లో శిరసు వంచి, అనుకూల పరిస్థితుల్లో శిరసు నెత్తిన అపార రాజనీతి విశారదుడు, సమరాంగణ సార్వభౌముడు ఛత్రపతి శివాజి. అట్టి మహా పురుషుని జీవితాన్ని తెలుగు పాఠకుల కోసం, కడు రమణీయంగా ఆవిష్కరించిన గడియారం శేష శాస్త్రి గారి ‘శివభారతం’ ప్రధానంగా వీర రస కావ్యం. కరుణ, భీభత్సం, అద్భుతం వంటి అంగ రసాలు కూడా ఈ కావ్యం లో కనిపిస్తాయి. ప్రతి పద్యంలో ఓజో గుణం ప్రత్యక్షమవుతుంది. తెలుగువారిలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తి కలిగించిన
ఛత్రపతి శివాజీ మహారాజ చరితం !
చారిత్రిక కావ్యరాజం – శ్రీ శివ భారతము !!
గ్రంధకర్త పరిచయము
శ్రీ గడియారం వేంకట శేషశాస్త్రి 1894 ఏప్రిల్ 7వ తేదీన జన్మించారు. విద్యాభ్యాసం కోసం ప్రొద్దుటూరులో స్థిరపడ్డారు. 1932లో అనిబిసెంట్ మున్సిపల్ పురపాలిక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. బ్రహ్మానందిని అనే సాహిత్య సాంస్కృతిక మాసపత్రికకు సంపాదకులుగా సేవలు అందించారు. వారు బహుముఖ ప్రజ్ఞాశాలి. తర్క, వ్యాకరణ, సాహిత్య శాస్త్రాలు, యజుర్వేదం, ఉపనిషత్తులు, అవధాన విద్యల్లో ఆరితేరారు. గోవర్ధన సప్తశతి, ఉత్తరరామాయణ గ్రంథాలు, సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు. పుష్పబాణ విలాసం, వస్తుజంత్రి, మల్లికామారుతం, శ్రీనాథ కవితాసామ్రాజ్యం, రఘునాధీయం, వాల్మీకి హృదయావిష్కరణ, శ్రీ శివ భారతము వంటి గ్రంథాలను రచించారు. నన్నయ్య భారతం, పోతన భాగవతం లాగా గడియారం వేంకటశేష శాస్త్రికి చిర కీర్తిని తెచ్చిన పెట్టిన గ్రంథం శివభారతం.
వారిని కవితావతంస, కవిసింహ, అవధానపంచానన అనే బిరుదులతో సత్కరించారు.
వారు గజారోహణ, స్వర్ణ గండపెండేరం, సువర్ణ కంకణం, కనకాభిషేకా లతో సత్కరింపబడ్డారు.
- 1948లో మద్రాసు ప్రభుత్వం దశాబ్ద కాలపు ఉత్తమ సాహితీ గ్రంథంగా శివభారతాన్ని ప్రథమ బహుమతితో సత్కరించారు.
- 1967లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహిత్య అకాడమి అవార్డు అందజేసింది.
- 1974లో మరాఠా మందిర్ వారు శివాజి త్రిశత జయంతి ఉత్సవాల్లో బంగారు పతకాన్ని బహుకరించారు.
- 1976లో వెంకటేశ్వర విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ను అందించారు.
- 1959 నుంచి 1968 వరకు శాసనమండలి సభ్యునిగానూ
1969 నుంచి 1973 వరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు
Reviews
There are no reviews yet.