Annamaiah Padamrutam అన్నయ్య పాదామృతం
శ్రీనివాసుడిని సేవించి తరించిన పరమభాగవతోత్తముడు తాళ్లపాక అన్నమాచార్యులు. ఆయన ప్రతి పదం ఆ పరమాత్మ పాదాలకు సమర్పించిన పరిమళ పారిజాతం. ఆయన ప్రతి పాట తెలుగు వాకిళ్లకు కట్టిన వసివాడని పచ్చతోరణం. ఆ పదకవితాపితామహుడు. వేలకొలది కీర్తనలతో ఆ వేంకటేశ్వరుడిని వినుతించటమే కాదు, ‘నా వలన నీకు కీర్తి, నీ వలన నాకు పుణ్యము’ అని స్వామిపై సాధికారతతో ప్రేమగా ప్రకటించుకున్నాడు. ఆధ్యాత్మికత నుంచి అభ్యుదయం వరకు అన్నమయ్య తన సంకీర్తనల్లో స్పృశించని అంశమంటూ లేదు. అమరభాష అయిన సంస్కృతంలో కీర్తించినా, అచ్చమైన తెలుగులో ఆలపించినా, భావప్రకటనలో ఆ వాగ్గేయకారుడు చేయని ప్రయోగమంటూ లేదు. అలా ఆ సంకీర్తనాచార్యుడి సాహిత్యం ఓ సారస్వత క్షీరసాగరం అంటే అతిశయోక్తి కాదు. అందుకే పారమార్థిక పురోగతికే కాదు ప్రాపంచిక పరిణతికి కూడా ఆయన సద్భావనలు దీపగోపురాలు, సమాజంలోని భావకాలుష్యానికి సత్వర నివారణోపాయాలు.