
ఆంగ్లేయుల ఏలుబడి అంతులేని దోపిడి -పుస్తకం సమీక్ష
- May 9, 2022
- 0 Comment(s)
డా౹౹త్రిపురనేని హనుమాన్ చౌదరి తెలుగువారికి చిరపరిచితులైన మేధావి. జాతీయవాద రచయితలకు అండగా,తప్పుడు వ్రాతలను చీల్చిచెండాడేవ్యక్తిగా జగమెరిగిన వ్యాఖ్యాత. ఇటీవల వెలువడిన ఈ గ్రంథానికి వారు మున్నుడి అందించారు. నాలుగుపుటలకు విస్తరించిన మాటలనుండి కొన్నే మీముందుంచు తున్నాను.
అచ్చమైన సమాచారం అద్భుతమైన కథనం
డా౹౹ బి. సారంగపాణి రచించగా 450 పుటల్లో విస్తరించియున్న “ఆంగ్లేయుల ఏలుబడి- అంతులేని దోపిడి” అనే పేరుగల ఈ గ్రంథం నన్ను కదలనివ్వ కుండా కూర్చోబెట్టి, వదలనివ్వకుండా ఆసాంతం చదివింపజేసింది. 16-18 శతాబ్దాలలో ఇంగ్లాండు దేశం ఎటువంటి దుర్భరమైన, దుఃఖదాయకమైన పరిస్థితులలో ఉండేదో ఈ గ్రంథం వివరిస్తుంది. 18వ శతాబ్దం మధ్యలో హిందూదేశంలో వ్యాపారంలోను, సైనిక పరమైన దుస్సాహసాలలోనూ ఆంగ్లేయులు పైచేయి సాధించి, ధనాఢ్యదేశంగా రూపుదిద్దుకొని రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నెలకొల్పినతీరు ఇందులో వివరంగా చెప్పబడింది.
వారు పోయి కాలూనిన చోట్ల క్రైస్తవీకరణమూ జరిగేది. సముద్ర యానంద్వారా నేరుగా హిందూ దేశానికి పోగల మార్గం కనుగొనవలసిందిగా, తద్వారా సుగంధ ద్రవ్యాల వ్యాపారం సాగించటమే గాక, తాము అడుగుపెట్టిన క్రొత్తగా వెలుగులోకివచ్చే భూభాగాలలో క్రీస్తుపేరిట ఏలుబడి సాగిస్తూ లబ్ధి పొందదగునని రోమ్ లో ఉండే క్రైస్తవ మతాధిపతి పోప్ స్పెయిన్, పోర్చుగల్ దేశాల రాజకుటుంబాల వారిని ఉత్సాహ పరిచాడు. ఇది ఉత్తరదక్షిణ అమెరికాలను, ఆఫ్రికా ఖండంలోని విస్తృత భూభాగాలను, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పిన్స్ తదితరదేశాలతో కూడిన ఓషియానియా ఖండాన్నీ చేరడానికి వారికి ప్రోత్సాహకమైంది. స్పెయిన్ పోర్చుగల్ దేశాలేగాక, ఇంగ్లాండ్, హాలెండు, బెల్జియం, ఫ్రాన్సు దేశాలుకూడా వ్యాపారంలో అగ్ర భాగాన నడవడానికి, తాము హస్తగతంచేసుకొన్న దేశాలపై ఆధిపత్యం సంపాదించడానికీ, ఆపైన ఆయా దేశాలనుండి కోరుకొన్నంత దోచుకొనడానికీ వారికి అవకాశమిచ్చింది.
ఇలా వారికి లభించిన బహుమానాలలో ఎన్నదగినది- ఊహకందనిస్థాయిలో సంపదలకు నిలయంగా ఉన్న హిందూదేశం. అది ఆంగ్లేయుల వశమైంది. క్రీస్తుశకం ఒకటవ శతాబ్దంలో జీవించిన ప్లీనీ అనే రోమన్ చరిత్రకారుడు (ఇతడు క్రీ.శ 79 లో మరణించాడు) తమ ఉత్పాదనలను ఎగుమతి చేయటం ద్వారా హిందూదేశం ప్రపంచంలోని బంగారానికి పాతరగా తయారవుతున్నదని వ్రాసి యున్నాడు. హిందూదేశంలోని సంపద ఏ ఒకటి రెండుసార్లో గాక మహమూద్ గజినీ, మహమ్మద్ ఘోరీల వంటివారిద్వారా 11నుండి 17 సార్లు దోచుకొన బడటమేగాక అలాగే తర్వాత వచ్చిన నాదిర్షా, అహమద్ షా అబ్దాలీలద్వారాకూడా ఎంతగానో కొల్లగొట్టబడింది. అయినప్పటికీ 18వ శతాబ్దపు ప్రథమార్ధంలో కూడా అప్పటి యావత్ ప్రపంచపు స్థూల ఉత్పాదనలోను, అంతర్జాతీయ వాణిజ్యం లోనూ దాదాపుగా 25శాతం హిందూ దేశానిదే! ఆ తరువాత పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి వారిని వ్యాపారంలో ఒక ప్రక్కకు నెట్టి మనదేశం లోని అత్యధిక భాగాలలో ఆంగ్లేయులు ఆధిపత్యం సాధించారు. గ్రేట్ బ్రిటన్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో, ఆ దేశానికి చెందిన ఈస్టిండియా కంపెనీ- మొగలులనుండి ఆ సామ్రాజ్యం అప్పటికే కొన్ని భాగాలను కోల్పోగా మిగిలిన భాగాల లోను, ఆ తర్వాత కొంతకాలానికి మొగలుల స్థానాలపై అదుపు సాధించిన మహారాష్ట్రులనుండి మరికొన్ని భాగాలనూ తమగుప్పిట్లోకి తెచ్చుకున్నారు.
1858లో యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) లోని విక్టోరియా రాణి ప్రభుత్వం హిందూదేశాన్ని తమ ప్రత్యక్ష పాలనలోకి తీసుకున్నారు. బ్రిటీషు వారు సిపాయిల తిరుగుబాటుయని పిలిచిన 1857 ప్రథమ అఖిలభారత స్వరాజ్య సంగ్రామం (వీర్ సావర్కర్ దానిని ఇలా వర్ణించారు) అనంతరం సంభవించిన పరిణామ మిది. అప్పటినుండి హిందూ దేశాన్ని ‘చట్టబద్ధం’ గానే దోచుకొనట మారంభమైంది. వ్యాపారంలో నియమ నిబంధలన్నీ వారికి అనుకూలం గాను, మనప్రజానీకానికి ప్రతికూలం గానూ ఉండేవి. తమ వలసదేశాలనుండి ‘ఆధునిక’ పద్ధతులలో సంపదను ఎగురవేసుకు పోవటమూ మొదలైంది.
స్థానికంగా ఉండే పరిశ్రమలను త్రొక్కిపార వేయటము, విపరీతంగా పన్నులు వేయటము, భూమిశిస్తు పేరున రైతుల రక్తాన్ని పీల్చివేయటము, ఈవిధంగా సమకూరిన నిధులతో ఎక్కడెక్కడో ఉన్న బ్రిటీషు సామ్రాజ్యాంతర్గతమైన భూములను రెండు ప్రపంచ యుద్ధాలలో (1914-19లో, మరల 1939-45లోనూ) రక్షించుకొనేందుకు బ్రిటీషు ఇండియా సేనలకు అవసరమయ్యే నిధులు సమకూర్చటమూ, ఇక్కడ పాలనాధికారం చలాయించి, జనజీవితాన్ని ధ్వంసంచేసిన బ్రిటీష్ అధికారులకు రిటైర్మెంటు తర్వాత పింఛనులు చెల్లించటము…ఇలా ఎన్నో విధాల నిధులు ఖర్చుచేసేవారు. అంతేకాని ఆ సమయాల్లో మహమ్మారి వ్యాధులు సోకిన, కఱవుల బారిన పడిన భారత ప్రజానీకానికి ఎలాంటి సహాయమూ చేసేవారు కాదు.
1947 ఆగస్టు15న వారు అధికారాన్ని మనవారికి అప్పగించేనాటికి హిందూదేశపు స్థూల జాతీయ ఉత్పాదన (జి.డి.పి) లో, ప్రపంచ వాణిజ్యంలో మనవాటాలు 25 శాతం నుండి 3 శాతంకంటే తక్కువగా దిగజారి పోయాయి. హిందూదేశంలో వ్యాపారం చేయడానికి అనుమతిని వేడుతూ 1606లో ఆంగ్లేయులు వచ్చినపుడు వారి దేశం ఎలాంటి శోచనీయమైన దుర్భర స్థితిలో ఉండినదో, అలాంటి దుర్భర స్థితికి మనలను దిగజార్చి హిందూదేశాన్ని వదిలిపెట్టిపోయారు.
ఇంగ్లీషు వ్యాపారుల చరిత్రను, వ్యాపారులుగా వచ్చి పాలకులుగా మారి హిందూదేశాన్ని శిథిల మొనర్చినవారి చరిత్రనూ వ్రాయటంలో డా౹౹ బొమ్మరాజు సారంగపాణిగారు చేసిన కృషి ఎంతో ప్రతిభావంతమైనది. ఇంగ్లీషువారు మనలను ఆర్థికంగా ధ్వంస మొనర్చటమేగాక, మన విద్యా వ్యవస్థను శిథిల మొనర్చటం మరింతగా గమనార్హ మైన విషయం. విద్యారంగంలోని ఈ మార్పులవల్ల కేవలం రంగులో, రక్తంలో మాత్రమే భారతీయులుగా ఉంటూ, మిగతా అన్ని విధాలా అభారతీయులుగా, ఆంగ్లేయుల వీరాభిమానులుగా తయారైన ఒక వర్గాన్ని వారు రూపొందించుకొన్నారు. ఈ వర్గంవారు ఎంతకాలం గడిచినా ఇప్పటికీ పాశ్చాత్యుల ఆలోచన లను, సిద్ధాంతాలనూ శిరసా వహించే వాహకులుగానే ఉంటున్నారు. ఆంగ్లం మాత్రమే మాట్లాడడానికి అలవాటు పడిన ఒక మహిళా పత్రకారిణికి హిందీ మాత్రమే వచ్చిన పిల్లలు చెప్పినమాట ఈ సందర్భం గా గుర్తు వస్తున్నది- “అంగ్రేజ్ చలే గయే- లేకిన్ ఉన్ కే ఔలాద్ కో ఛోడ్ కే” (ఆంగ్లేయులు వెళ్లిపోయారు- అయితే వారి మానసపుత్రులను ఇక్కడే ఉంచారు)
బ్రిటీషువారు హిందూదేశాన్ని ఎలా వంచించి, విధ్వంసంగావించారో, ఆ విషయాలను డా౹౹ సారంగపాణి గారి ఈ పుస్తకం పాఠకులకు తెలియజెప్పి, వారిని మతిమంతులను చేస్తుంది. బ్రిటీషువారు ఆర్థికంగా దోచుకున్నారు, మేధోపరంగా వలసపాలనతో సర్దుకుపోయే మస్తిష్కాలను తయారుచేశారు. హిందూదేశంలో ఇంగ్లీషు వారిపాలన ఎలా ఉండినదో, వారు ఎన్నివిధాలుగా ఎంతెంత దోచుకుపోతున్నారో బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నుకోబడిన మొదటి భారతీయుడైన దాదాభాయి నౌరోజీ 1892లో వ్రాసిన ‘పావర్టీ అండ్ అన్ బ్రిటీష్ రూల్ ఇన్ ఇండియా’ (Poverty and Un-British Rule in India) అనే పుస్తకంలో విపులంగా చెప్పారు. బ్రిటీష్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ (జననం 6-12-1732, మరణం 22-8-1818)ను అభిశంసిస్తూ జరిగిన చర్చ సందర్భంలోను, రాబర్ట్ క్లైవ్ (జననం 29 సెప్టెంబరు 1725, మరణం 22 నవంబర్ 1774) హిందూదేశంనుండి మూటగట్టి తెచ్చుకున్న సంపదతో ఎంత సంపన్నుడైనాడో తెలియజెప్పినపుడు ఇది మరింత స్ఫుటంగా వెల్లడైంది.
అంచనాలకు అందని విధంగా భారీగా హిందూదేశపు సంపదలను కొల్లగొట్టి తీసుకుపోయి, హిందూదేశాన్ని ఒక దిబ్బగా మార్చిన వైనాన్ని, ఇక్కడ వస్తూత్పాదన లో జీవితాలుగడిపేవారి బ్రతుకులను బండలపాలు చేసిన వైనాన్ని, వేల సంవత్సరాల చరిత్ర కలిగిన నాగరికతా, సంస్కృతి, వారసత్వ విజ్ఞానాలను అపవిత్రీక రించిన వైనాన్ని చక్కగా తెలియజెప్పి నందుకు డా౹౹బొమ్మరాజు సారంగపాణిగారిని మరోసారి మనసారా అభినందిస్తున్నాను. మినూమసానీ రచించిన అవర్ ఇండియా (Our India) అనేపుస్తకం 1940 దశకపు ద్వితీయార్ధంలో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఉపవాచకంగా ఉండేది. మన ప్రజలకు ఈ విషయాలను తెలియ జెప్పడానికి ఆ పుస్తకం అవసరమైన అనంతర పరిణామాలను చేర్చి పునః ప్రచురింపబడాలని నేను కోరుకొంటున్నాను. పుణ్యభూమియైన మన భారతదేశం ప్రకృతి సిద్ధంగా ఎటువంటి సంపదలతో అలరారుతున్నదో మన యువతరానికి తెలియాలి కదా! ఇంతటి అద్భుతమైన పుస్తకాన్ని ప్రచురించ డానికి పూనుకొన్న ‘నవయుగభారతి’ని ధన్యవాద పూర్వకంగా అభినందిస్తున్నాను.
Buy the book here